ఎస్ఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ ప్రగతి సాధ్యంమని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏఎస్ఆర్ఆర్ నగర్ లోని ఎస్ఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నస్పూర్ ఎంఈఓ పద్మజ, ఎంఆర్సీ దేవేంద్ర, మహిళా ఏఎస్ఐ శకుంతల, ఏఎన్ఎంలు అనిత, తిరుపతమ్మలను పాఠశాల యాజమాన్యం గౌరవించింది. సేవా రంగంలో మహిళలు అందిస్తున్న సహకారం మరువలేనిదని మేయర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన నాటకాలు, జానపద గేయాలకు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్, ప్రిన్సిపాల్ రెగళ్ళ ఉపేందర్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, ఉపాధ్యాయుడు సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







