బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: బెల్లంపల్లి శాంతిఖని గనిలో విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా శుక్రవారం రోజున ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టాలు కార్మిక హక్కులను కుదించే కుట్రగా అభివర్ణిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను కలిపి రూపొందించిన ఈ కోడ్లు కార్మికులకు రక్షణ కల్పించేందుకు కాకుండా యాజమాన్యాలకు అధికారం పెంచేందుకు ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా 300 మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కూడా సులభంగా ఉద్యోగాల నుంచి తొలగించే నిబంధనలు తీసుకురావడం దారుణమని మండిపడ్డారు. ఇక కార్మికుల నిరసన హక్కును పరిమితం చేయడం, కాంట్రాక్ట్ మరియు గిగ్ వర్కర్లను నిర్లక్ష్యం చేయడం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి కీలక అంశాలను పక్కన పెట్టడం ఈ చట్టాల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. ఇవి సంక్షేమ పథకాలు కావు… కార్మికులపై భారంగా మోపిన దోపిడీ విధానాలు అని తీవ్రంగా విమర్శించారు. 2026 ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెను గుర్తు చేస్తూ, కార్మికుల వ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు కూడా ఈ విషయంలో మౌనం వహించడం కార్మిక వర్గానికి ద్రోహమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం. పోచమల్లు, అంబాల మహేందర్, గోగర్ల శంకర్, జి. అంజయ్య, ఎన్నం శంకర్ తదితరులు పాల్గొని, కార్మికులు అప్రమత్తంగా ఉండి తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.








