మంచిర్యాల బీజేపీ అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సభలో మహిళా బిల్లు ప్రాధాన్యత, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహిళలు తమ హక్కుల కోసం చట్ట సభల్లో గళం విప్పేందుకు ఈ బిల్లు గొప్ప అవకాశం కల్పిస్తుందని రఘునాథ్ వెరబెల్లి చెప్పారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో ప్రజల మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బీజేపీ కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ అంశాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా క్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, తోట మల్లికార్జున్, ఎనగందుల కృష్ణ మూర్తి, కమలాకర్ రావు, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రి, సత్రం రమేష్, స్వామి రెడ్డి, హరి గోపాల్, హేమంత్ రెడ్డి, వైద్య శ్రీధర్, జయరామ రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.








