నస్పూర్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వీటి పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ ఉషారాణి పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డిసిపి భాస్కర్ పర్యవేక్షణలో శుక్రవారం నస్పూర్ కాలనీ, షిర్కే ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు నిర్భయంగా ప్రయాణించే వాతావరణాన్ని కల్పించడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎస్ఐ సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మహిళలను ఇబ్బంది పెడుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని కోరారు. మహిళలు వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700ను సంప్రదించాలని అధికారులు సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930 హెల్ప్లైన్ నంబర్ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఆటో యూనియన్ అధ్యక్షుడు జగదీశ్, ఉపాధ్యక్షుడు సతీష్, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.







