విశేష అభిషేకాలు, హోమం.. సాయంత్రం అన్నప్రసాద వితరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ మహా దుర్గ దేవాలయంలో మే 5 మంగళవారం సంకటహర చతుర్థి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఆనంద్ శర్మ, సాత్విక్ శర్మ తెలిపారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుండి భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం లోక కల్యాణార్థం లక్ష్మీ గణపతి హవనం (హోమం) జరగనుంది. సాయంత్రం 7 గంటలకు సంకష్టి దీక్షా భక్తులతో కలిసి స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. వినాయక భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకల్లో నస్పూర్ పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.







