శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
ఆర్.కె 5 గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్లకు ప్రోత్సాహక బహుమతుల అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలిని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 భూగర్భ గనిలో ఉత్పత్తి, ఉత్పాదకత అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. వార్షిక ఉత్పత్తి సాధనలో 95 శాతానికి చేరుకుని, వంద శాతం లక్ష్యానికి చేరువలో వెనకబడటం విచారకరమని పేర్కొన్నారు. మిగిలిన 20 రోజుల కాలంలో కార్మికులందరూ సమన్వయంతో కృషి చేసి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. గతంలో సింగరేణిలోనే ఉత్పత్తితో పాటు అన్ని రంగాల్లో ముందువరుసలో నిలిచిన ఆర్.కె 5 గనికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. గనిలోని 5వ సీమ్ నార్త్ సైడ్ ప్రాంతంలో మరింత బొగ్గు వెలికితీసే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల గని జీవితకాలం మరో రెండు, మూడు ఏళ్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పని చేసి గని భవిష్యత్తును కాపాడాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలలో అత్యధిక టబ్బులు నింపిన ఎస్డీఎల్ ఆపరేటర్లకు మునిగంటి శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతిభ కనబరిచిన వారిని ఆదర్శంగా తీసుకుని ఆపరేటర్లందరూ గరిష్ట ఉత్పత్తి దిశగా పోటీ పడాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కోల్ కట్టర్లు, సపోర్ట్ మెన్లు, ట్రామర్, షార్ట్ ఫైరర్, సర్దార్లు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, గ్రూప్ ఏజెంట్ ఎన్. శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గ్రూప్ ఇంజనీర్ భట్టాచార్య, రక్షణ అధికారి శివయ్య, సంక్షేమ అధికారి హరికృష్ణ, అసిస్టెంట్ మేనేజర్లు రాందాస్, వినయ్ రెడ్డి, గని పిట్ సెక్రటరీ నర్సింగ రావు, అండర్ మేనేజర్లు, మైనింగ్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.







