అల్లూరి సీతారామరాజు నగర్లో సీసీ రోడ్డు పనుల పరిశీలన
మురుగు కాలువల పూడికతీత పనుల పర్యవేక్షణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని 32వ డివిజన్ అల్లూరి సీతారామరాజు నగర్లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో భాగంగా నగరంలో చేపట్టిన కాలువల పూడికతీత, చెత్త తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు.
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, మురుగు కాలువల్లో చెత్త వేయకూడదని సూచించారు. గృహాలు, పరిశ్రమలు, మార్కెట్ ప్రాంతాల వ్యర్థాలను రోడ్లపై వేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాల మరమ్మత్తులు, మురుగు కాలువల శుభ్రత పనులను నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపతి తిరుపతి, రెంక రవి, నాగిరెడ్డి రాజు, రవి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








