మిగిలిన 84 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్.. వెల్లడించిన ప్రిన్సిపాల్ కూర్మ రాజేందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రత్యేక కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ తేదీని ముందుకు మార్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ (ఏజీఎం) కూర్మ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారుల ఆదేశాల ప్రకారం జూలై 8 లోపే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున, గతంలో జూలై 8న జరగాల్సిన కౌన్సెలింగ్ను ప్రభుత్వ సూచనల మేరకు జూలై 4న (శనివారం) నిర్వహించనున్నారు. జూన్ 11న జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం కాలేజీలోని 5 బ్రాంచ్లలో మొత్తం 84 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో సివిల్ ఇంజినీరింగ్లో 22, కంప్యూటర్ ఇంజినీరింగ్ 11, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 07, మెకానికల్ ఇంజినీరింగ్ 21, మైనింగ్ ఇంజినీరింగ్లో 23 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్ 18 నుండి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 2తో (నేటితో) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 4న జరిగే స్పాట్ కౌన్సెలింగ్కు 4 సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆన్లైన్ అప్లికేషన్ కాపీపై సంబంధిత మైన్/విభాగపు అధికారి సంతకం, ఆఫీస్ స్టాంప్తో పాటు సుమారు రూ. 20,000 నగదుతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్లో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అప్పటికీ సీట్లు మిగిలితే ఇతరులకు కేటాయిస్తామని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.



