- పుస్తకాలను చదివించడం ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది
- నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సోన్, ఆర్.కె న్యూస్: చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఎంపిపియస్ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలకు సంబంధించిన వివరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులంతా క్రమం తప్పకుండా బడికి వచ్చే విధంగా చూడాలన్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు కథలు చదివిపించి, ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు రాబట్టారు. సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులు బహుమతులుగా ఇచ్చారు.కలెక్టర్ మాట్లాడుతూ, పుస్తకాలను చదివించడం ద్వారా భాషా జ్ఞానం, సబ్జెక్టుపై నైపుణ్యం పెరుగుతుందన్నారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన వివరాలన్నీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు, ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ అడిగారు. జవాబులు చెప్పిన విద్యార్థులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. వారికి పెన్నులు బహుమతులుగా అందించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ సంతోష్, ఎంపీవో జ్యోతి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.







