- అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేస్తాం: నరెడ్ల శ్రీనివాస్
- హెచ్ఎంఎస్ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండి హుస్సేన్ నియామకం
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాల కల్పన, ఉద్యోగ భద్రత కోసం హెచ్ఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తూ అండగా నిలుస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో కార్మికులను దోపిడీ చేస్తూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని శ్రీనివాస్ విమర్శించారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆర్టీసీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, 108, 104 ఉద్యోగులు, ప్రైవేట్ హాస్పిటల్ కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, రవాణా, భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో హెచ్ఎంఎస్ను మరింత బలోపేతం చేస్తూ వివిధ రంగాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎండి హుస్సేన్ను హెచ్ఎంఎస్ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా నియమితులైన హుస్సేన్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం, సంఘ విస్తరణ కోసం అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎండి షఫీ, కార్యదర్శి తగరం శ్రీనివాస్, నాయకులు దున్నపోతుల రమేష్, పి. శ్రీనివాస్, రాజిరెడ్డి, ఎండి అజీమ్, ఏ. మహేష్, చందు, సురేష్, పవన్ పాల్గొన్నారు.







