అమృత్ 2.0 పనులు ముగిసినా అక్రమ తవ్వకాలు.. రూ. 78 వేల విలువైన మట్టి తరలింపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ చెరువులో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వి తరలించిన సబ్ కాంట్రాక్టర్ పెంచాల శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల మైనర్ ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సృజన శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకంలో భాగంగా చెరువు సుందరీకరణ, కట్ట మరమ్మతుల కోసం ఇచ్చిన అనుమతులను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇరిగేషన్ శాఖ నుంచి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చెరువు కట్ట మరమ్మతుల కోసం మాత్రమే లోపలి మట్టిని వాడుకునేందుకు సబ్ కాంట్రాక్టర్ శ్రీధర్కు గతంలో అనుమతి లభించింది. కట్ట పనులు పూర్తయి, ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కూడా జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో మట్టిని బయటకు తరలిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు నిఘా పెట్టి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అధికారుల దర్యాప్తులో సబ్ కాంట్రాక్టర్ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 158 మీటర్ల మేర మట్టిని అక్రమంగా తవ్వి తరలించినట్లు నిర్ధారించారు. దొంగిలించిన ఈ మట్టి విలువ సుమారు రూ. 78,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ సొత్తును అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న సబ్ కాంట్రాక్టర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ సృజన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







