ఘనంగా చండీ హోమం.. పాల్గొన్న మేయర్ ధరణి మధుకర్, జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ మహా దుర్గా దేవాలయంలో ఆలయ కమిటీ, నస్పూర్ పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శాకంబరి యుక్త వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ (ఆషాఢ శుద్ధ పాడ్యమి) నుండి 23వ తేదీ (ఆషాఢ శుద్ధ నవమి) వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి తొమ్మిది రకాల కుంకుమలతో నిత్య లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన, మహా కుంకుమాభిషేకం మరియు మహిళలచే విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 108 సార్లు లలితా సహస్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక కుంకుమాభిషేకాలు పూర్తిచేశారు. నవరాత్రి మహోత్సవాల సంపూర్ణ ఫలప్రాప్తి కొరకు శుక్రవారం ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనంద్ శర్మ, శ్రీరాంభట్ల సాత్విక్ శర్మ, శ్రీరాంభట్ల ఆకాష్ శర్మల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. ఈ హోమంలో అమ్మవారికి 25 పట్టుచీరలు, బంగారు ముక్కుపుడక, వెండి పాదాల పట్టీలను పూర్ణాహుతిగా సమర్పించారు. ఈ చండీ హోమం మరియు ముగింపు వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ దంపతులు, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్, జీఎం మునిగంటి శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హోమానంతరం భక్తులకు విస్తృతంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం సభ్యులు చేసిన విశేష ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, నస్పూర్ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.








