- టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక బాట కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని కార్మికులను కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. గని యాజమాన్యం కార్మికులపై అధిక పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మిక సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని మణిరామ్ సింగ్ విమర్శించారు. నిలిపివేసిన మెడికల్ బోర్డును తక్షణమే ప్రారంభించాలని, అనారోగ్యంతో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కొత్త గనులు ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. పని స్థలాల్లో అవసరమైన పనిముట్లు సమకూర్చాలని, మహిళా కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని మణిరామ్ సింగ్ కోరారు. సింగరేణిలో కార్మికులు అదనంగా ఉన్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికులకు లాభాల వాటాను యథావిధిగా చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గద్దల నారాయణ, ట్రెజరర్ రాజనర్సు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్లు మల్లయ్య, బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజర్ కొత్తూరి నారాయణ, నాయకులు గజ్జె దుర్గయ్య, సుందిళ్ల స్వామి, రాజబాబు, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.







