నెలకు ఒకసారి శుభ్రం చేయాలని మేయర్ ఆదేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్లో మున్సిపల్ సిబ్బంది మంగళవారం తాగునీటి ట్యాంకును శుభ్రం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి నెలా ట్యాంకులను తప్పనిసరిగా శుద్ధి చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మేయర్ దర్ని మధుకర్ ఆదేశించారు. ఈ మేరకు కార్పొరేషన్ సిబ్బంది ట్యాంకును పూర్తిగా శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ కార్యక్రమాన్ని 32వ డివిజన్ అధికారి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా పర్యవేక్షించారు. తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్పొరేషన్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.







