అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపులో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, 2023 జూలై 1 నుండి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన విద్యా విధానంను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపివేసి అవసరమైన చోట కొత్త పాఠశాలలను తెరవాలన్నారు. విద్యాహక్కు చట్టానికి సవరణలు చేసి, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్యకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కోశాధికారి బి. కిరణ్, జిల్లా కార్యదర్శి బి. దేవదాస్, జిల్లా కమిటీ సభ్యులు యు. తిరుపతి, భారీక్ రావు, తిరుపతి, శ్రీనివాసరెడ్డి, రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.







