- శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్
- శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కన్నుల పండువలా మాజీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం
ఆర్.కె న్యూస్, నస్పూర్: 34 ఏళ్ల తర్వాత అందరం ఒకే చోటుకు చేరుకుని మధుర స్మృతులు గుర్తు చేసుకోవడం సంతోషంగా హర్షణీయమని శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఆదివారం మాజీ కార్మిక క్రీడాకారులు, అధికారులు, కళాకారుల మహా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దశాబ్దాల అనుబంధం ఉన్న వారంతా ఒకే వేదికపైకి చేరడంతో మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ఎం శ్రీనివాస్ తో పాటు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు
ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 34 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఈ అరుదైన వేడుకను నిర్వహించారు. సమ్మేళనం ప్రారంభానికి ముందు శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ క్రీడా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 మంది క్రీడాకారులు, అధికారులు, కళాకారులు శోభాయాత్రగా ప్రగతి మైదానానికి చేరుకున్నారు. అక్కడ క్రీడా లోగోను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక సావనీర్ను విడుదల చేశారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం జరగడం మరుపురాని అనుభూతి అని అతిథులు పేర్కొన్నారు. సింగరేణి సంస్థ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ఎం శ్రీనివాస్ కొనియాడారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రగతి స్టేడియం ఎన్నో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన వేలాది మంది క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగారు. మంచి ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకమని ఆయన వివరించారు. క్రీడాకారులు, కళాకారుల ప్రతిభను గుర్తించి వారిని జ్ఞాపికలతో సన్మానించారు. వేడుకలో భాగంగా విద్యార్థులు, సింగరేణి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ అలాయ్ బలాయ్ ద్వారా పలకరించుకున్నారు. పాత జ్ఞాపకాలను పంచుకుంటూ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యక్షులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కో కన్వీనర్ ఇసంపెల్లి, రాంచందర్, గోవర్దన్రెడ్డిల ఆద్వర్యంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, ఎస్ఓటూజీఎం ఎన్ సత్యనారాయణ, రిటైర్డ్ జీఎంలు ఈవీ పురుషోత్తం, పాండురంగారావు, టీపీఏ ప్రేంకుమార్, రామకృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ హన్మంతరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రఘునాధరెడ్డి, కార్పొరేటర్ వేల్పుల రవీందర్, సీనియర్ క్రీడాకారులు పుల్లయ్య, జూపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



