- పేదోడి పక్షాన వందేళ్ల పోరాటం: మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
- 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ
నస్పూర్, ఆర్.కె న్యూస్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ప్రస్థానం పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పోరాట చరిత్రని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద శనివారం సీపీఐ 100 సంవత్సరాల పైలాన్ లోగోను ఆవిష్కరించారు. శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ, ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సమ సమాజ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తోందని వివరించారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా 4500 మంది ప్రాణత్యాగంతో 3000 గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. అయితే, స్వాతంత్ర్య పోరాటంలో కనీస పాత్ర లేని బీజేపీ ప్రభుత్వం నేడు చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ శతజయంతి ముగింపు ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని, జిల్లాలోని పార్టీ శ్రేణులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జోగుల మల్లయ్య, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, కె. వీరభద్రయ్య, లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, కొత్తపల్లి మహేష్, దొడ్డిపట్ల రవీందర్ పాల్గొన్నారు.







