మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
సీసీసీ డంప్ యార్డ్ లో చెలరేగిన మంటలు.. స్వయంగా పర్యవేక్షించి అదుపు చేయించిన మేయర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఆదేశించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ డంప్ యార్డ్ లో ఆదివారం ఎండల తీవ్రత కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద, ప్రజల ద్వారా సమాచారం అందుకున్న మేయర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించి అగ్నిమాపక యంత్రాన్ని పిలిపించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు మేయర్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. డంప్ యార్డ్ వద్ద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విపత్తు సమయంలో సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంలో సహకరించిన ఫైర్ సిబ్బందిని అభినందించారు. డంప్ యార్డ్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన మేయర్ ధర్ని మధుకర్ ను స్థానిక ప్రజలు ప్రశంసించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సిబ్బందితో కలిసి మేయర్ తీసుకున్న చర్యలు స్థానికులకు ఊరటనిచ్చాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుట్ట యశోద, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







