ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
పవర్ లక్ష్మి కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ కు చెందిన పవర్ లక్ష్మి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 2,50,000 ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. పవర్ లక్ష్మి కుటుంబ సభ్యులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి ఈ నిధులను మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులోనూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవ పట్ల లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.







