7
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆదేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సింగరేణి వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులతో ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేడుకలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉదయం నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి సింగరేణి ఉద్యోగుల నివాసాల మీదుగా జీఎం కార్యాలయం వరకు బతుకమ్మలు, పీరిల ఊరేగింపు, ఒగ్గుడోలు, పోతరాజుల నృత్యాలతో భారీ ర్యాలీ సాగనుంది. అనంతరం అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రగతి స్టేడియంలో ఉద్యోగుల కుటుంబాల కోసం ప్రత్యేక స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారయణ, సీఎంఓఏఐ శ్రీరాంపూర్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఈ అండ్ ఎం) రమణ రావు, డీజీఎంలు ఆనంద్ కుమార్, ఎస్. అనిల్ కుమార్, హరినారాయణ, ఎస్టేట్ (మేనేజర్) వరలక్ష్మి, డీవై పీఎం కిరణ్, సీనియర్ పీఓ సురేందర్, అన్ని గనుల ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.







