శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులపై కార్మిక సంఘాల ఉమ్మడి ధర్నా
నస్పూర్, ఆర్.కె న్యూస్: బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 12వ వేజ్ బోర్డు వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని బొగ్గు గనులు, విభాగాల పై భారీ ధర్నాలు నిర్వహించి, యాజమాన్య ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటి వరకు 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ వేతన కమిటీ ఏర్పాటును కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే స్పందించి వేతన కమిటీని నియమించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఉమ్మడి నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కె బాజీ సైదా, నాయకులు కొట్టే కిషన్ రావు, మోత్కూరి కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, నాగభూషణం, బద్రి బుచ్చయ్య, ఫిట్ కార్యదర్శులు దాడి రాజయ్య, మురళి చౌదరి, మోతే లచ్చన్న, మారపల్లి సారయ్య, ఆకుల లక్ష్మణ్, గునిగంటి నర్సింగ్రావు, ఐఎన్టీయూసీ నాయకులు శీలం చిన్నయ్య, జగన్, శ్రీధర్, గోపాల్ రెడ్డి, నంబయ్య, అశోక్, సీఐటీయూ నాయకులు సుధాకర్, సందీప్, హెచ్ఎంఎస్ నాయకులు శశిధర్, ప్రసాద్, సురేందర్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.







