మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్
సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో శనివారం రైతులకు ఎల్-నీనో పరిస్థితులు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్-నీనో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి వనరుల లభ్యత తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. ముఖ్యంగా కాలువల ద్వారా సాగునీరు అందే ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గే అవకాశమున్నందున రైతులు పంటల ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని సూచించారు.అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి (మెట్ట) పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.అలాగే వర్షపు నీటిని వృథా కాకుండా ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, చెక్డ్యాంలు, కందకాల ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు నీటి సంరక్షణ పద్ధతులపై వ్యవసాయ అధికారులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగన్న, రాజేందర్, రాజలింగం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.







