కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే-1ఏ గనిని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా తదితర నాయకులు శనివారం సందర్శించారు. గనిలోని ప్రతి విభాగాన్ని పరిశీలిస్తూ, కార్మికులను నేరుగా కలిసి పని ప్రదేశాల్లో వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అవసరమైన పనిముట్లు సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని కార్మికులు వివరించారు. అలాగే గనిలోకి వెళ్లే మ్యాన్వే వద్ద వర్షం, ఎండల నుండి రక్షణ పొందేందుకు శాశ్వత షెడ్డు నిర్మించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న వాష్రూమ్లు సరిపోవడం లేదని, వాటి సంఖ్యను పెంచి క్రమం తప్పకుండా పరిశుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు తాగునీటి సౌకర్యం, భద్రతా పరికరాల సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనపై వినతులు అందించారు. కార్మికులు తెలిపిన ప్రతి సమస్యను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం, భద్రత, మెరుగైన పని వాతావరణం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్, సురేష్, నరసయ్య, సురేష్, కేశవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.







