- రూ. 109 కోట్ల రుణం వడ్డీతో సహా చెల్లించా
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి
- ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా పునర్నిర్మాణ వీడియోల ప్రదర్శన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయాల ఆధునీకరణ పనులు వచ్చే శ్రావణమాసంలోగా ప్రారంభమవుతాయని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్
సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని నార్త్ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయాల పునర్నిర్మాణ నమూనా వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణమాసంలోగా పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. రెండవ అన్నవరంగా పేరుగాంచిన గూడెం ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు ఒకేసారి వెయ్యి జంటలు వ్రతాలు చేసుకునేలా మండపాలను, భక్తులకు వసతులు, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అప్పుల చెల్లింపు విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రూ. 450 కోట్ల రుణానికి ఆమోదం లభించగా రూ. 109 కోట్ల రుణం మాత్రమే తీసుకుని వడ్డీతో సహా చెల్లించానని స్పష్టం చేశారు. పొలిటికల్ జీవితంలోకి రాకముందే వ్యాపారంలో ఎదుగుదల సాధించానని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, నాయకులు నలిమెల రాజు, సయ్యద్ షాహిద్ అలీ, పూదరి తిరుపతి, మంగిలాల్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.







