హైదరాబాద్లో ఘనంగా అవార్డు ప్రదానం.. విద్యార్థి ఉద్యమ సేవలకు గుర్తింపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మాదిగ స్టూడెంట్ ఫోరమ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి కొండ్ర ఉదయ్ ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఉత్సవాల కమిటీ ప్రతినిధులు ఉదయ్కు ఈ అవార్డును అందజేశారు. విద్యార్థి ఉద్యమకారునిగా, వర్గీకరణ సాధన కోసం ఉదయ్ చేసిన విశేష సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ రోజరాణి చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఉన్నత స్థాయి ఎదుగుదల కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉదయ్ పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశానని, భవిష్యత్తులోనూ వారి హక్కుల సాధన కోసం ముందుంటానని ఉదయ్ స్పష్టం చేశారు. విద్యా రంగంలో సంస్కరణలు, దళిత విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.







