- వనితా వాక్కు ఫౌండర్, అడ్వకేట్ రంగు వేణు కుమార్
- మారుతి నగర్లో మాతృమూర్తులకు పాదపూజ.. వనితా వాక్కు ఫౌండేషన్ ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: “పిల్లల సంతోషంలో స్వర్గం వెతికే ఏకైక దేవత తల్లి. ఆమె బ్రతికుండగానే ప్రేమను పంచడం, అలసిన ఆమె మనసుకు మన సమయం ఇవ్వడమే నిజమైన మాతృదినోత్సవం” అని వనితా వాక్కు ఫౌండర్, అడ్వకేట్ రంగు వేణు కుమార్ పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల మారుతి నగర్లో మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం, పాదపూజను ఘనంగా నిర్వహించారు. తల్లి ప్రేమకు ప్రతిఫలం లేదని, బిడ్డల క్షేమం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని మాతృమూర్తులను గౌరవించుకోవడం అందరి బాధ్యత అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ఇదే రోజున 2022లో వనితా వాక్కు ఫౌండేషన్ స్థాపించబడిన నేపథ్యంలో, సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సభ్యులు జరుపుకున్నారు. గత రెండేళ్లుగా మహిళా చైతన్యం కోసం సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాతృమూర్తుల ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు తల్లులకు పూలమాలలు వేసి, పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వనితా వాక్కు సభ్యులు తమ మాతృమూర్తులతో కలిసి పాల్గొని ఈ వేడుకను మరుపురాని అనుభూతిగా మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో-ఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కురుమ సునీత, డాక్టర్ అన్నపూర్ణ, జోష్ణ చంద్రధర్, చిగురు మంజుల, చందన రాజకొండ, చంద్రకళ, కొండ శైలజ తదితరులు పాల్గొన్నారు.








