అనుమతి లేకుండా వెళ్లి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడంపై ఆగ్రహం
నస్పూర్, ఆర్.కె న్యూస్: పాఠశాలలు ప్రారంభం కాగానే జిల్లాలోని కొన్ని విద్యార్థి సంఘాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. పాఠశాలల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిబంధనలకు సంబంధించిన పత్రాలను ట్రస్మా ప్రతినిధులు అందజేశారు. ప్రైవేటు పాఠశాలల పుస్తకాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా దగ్గరలోని బుక్ స్టాళ్లలో అమ్ముకోవచ్చనే జీవో 76 కాపీని, గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయ అధికారులకు సమర్పించారు. విద్యాసంస్థల్లో ఏవైనా లోపాలు ఉంటే విద్యార్థి సంఘాలు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప పాఠశాలల్లోకి చొరబడి దుర్భాషలాడటం, వాదించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, ట్రెజరర్ రామకృష్ణారెడ్డి, సంఘం నాయకులు ప్రమోద్, సత్యనారాయణ, అమన్, రాజ్ కుమార్, శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు.







