సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దేశానికి వెలుగులు పంచేందుకు తమ రక్తాన్ని చెమటగా మార్చి, నల్లబొగ్గు గనుల్లో శ్రమించిన విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే అది నిజమైన హోలీ పండుగ అవుతుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ విశ్రాంత కార్మికుల దీన స్థితిని వివరించారు. దశాబ్దాల కాలం కఠిన శ్రమతో దేశ ప్రజలకు విద్యుత్ కాంతులు అందించిన కార్మికులు నేడు పెన్షన్ సరిపోక, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాథమిక అవసరాలు తీర్చలేని ప్రస్తుత పెన్షన్ విధానం, పరిమితులతో కూడిన సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు వల్ల విశ్రాంత ఉద్యోగుల జీవితాలు చీకటిమయంగా మారాయని విమర్శించారు.
బొగ్గు గని విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంచాలని, అపరిమిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సుదీర్ఘ కాలంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తున్నట్లు వేణు మాధవ్ తెలిపారు. యాజమాన్యాలకు ఎన్ని విన్నపాలు చేసినా ఎటువంటి సానుకూల ప్రతిపాదనలు రాకపోవడం శోచనీయమన్నారు. ఈ సమస్యల కారణంగానే ఉద్యోగులు కుటుంబ పరమైన చిక్కుల్లో కూరుకుపోయి హోలీ వంటి రంగుల పండుగను జరుపుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం, బొగ్గు సంస్థ యాజమాన్యాలు తక్షణమే స్పందించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.
విశ్రాంత ఉద్యోగుల శేష జీవితం ప్రశాంతంగా గడవాలంటే అపరిమిత వైద్య సౌకర్యం కల్పించడం అత్యవసరమని వేణు మాధవ్ స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్మికుల బతుకుల్లో రంగులు నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థ అభివృద్ధికి పునాదులు వేసిన వారి పట్ల యాజమాన్యం కనికరం చూపి, తగిన ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.







