నస్పూర్, ఆర్.కెన్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా హెచ్ఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి ప్రకటించిన 9 మంది పార్లమెంట్ ఇన్చార్జిల జాబితాలో సారయ్యకు స్థానం లభించింది. ప్రస్తుతం హెచ్ఎమ్ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సారయ్య, 1985లో విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజా రంగంలోకి వచ్చారు. 1989లో సింగరేణి సంస్థలో ఉద్యోగిగా చేరినప్పటి నుంచి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడారు. 1995 నుండి వర్తమానం, కోల్ వాయిస్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికల్లో విలేకరిగా కూడా సేవలందించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2006లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా, 2007లో ప్రజాయుద్ధ నౌక గద్దర్తో కలిసి బొగ్గుబాయి టు బొగ్గుబాయి ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. టీజేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వేదికల ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేసిన ఆయన, ప్రస్తుతం పార్టీ బలోపేతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
10







