శ్రీరాంపూర్ జీఎంకు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: ట్రేడ్స్మెన్స్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఐఎన్ టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ట్రేడ్స్మెన్స్ పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్కు యూనియన్ ప్రతినిధులు మెమోరాండం అందజేశారు. రక్షణ పరికరాల కొరత, పని భారం, వేతన వివక్ష వంటి అంశాలపై వారు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల భద్రతను విస్మరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. గనిలో పనిచేసే ట్రేడ్స్మెన్స్కు టూల్స్, టూల్ బ్యాగ్స్, సేఫ్టీ గ్లోవ్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం లేదని నాయకులు ఆరోపించారు. ఉద్యోగులే సొంతంగా పనిముట్లు కొనుక్కోవాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. టెక్నీషియన్ల కొరత ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందిపైనే అధిక పని భారం మోపుతున్నారని విమర్శించారు. అత్యవసర పనుల కోసం పిలిపించినప్పటికీ ఈ అండ్ ఎం సిబ్బందికి అదనపు మస్టర్లు లేదా ఓవర్ టైం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ సిబ్బందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక సిబ్బంది పట్ల స్పష్టమైన వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. గనుల్లో హెల్పర్లు లేకపోవడం, సరైన పర్యవేక్షణ లోపించడం వల్ల పని ప్రదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత విద్యుత్ వ్యవస్థ, కాలం చెల్లిన కేబుల్స్, సబ్స్టేషన్లు, బలహీనమైన కమ్యూనికేషన్ వ్యవస్థతో కార్మికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వివరించారు. కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ 2017, డీజీఎంఎస్ నిబంధనలను యాజమాన్యం తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. కార్మికులకు కనీస విశ్రాంతి గదులు, పిట్ హెడ్ బాత్ సౌకర్యాలు కూడా లేవని గుర్తు చేశారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, డీజీఎంఎస్ నిబంధనల మేరకు రక్షణ శిక్షణ ఇవ్వాలని ఐఎన్ టీయూసీ కోరింది. ఎలక్ట్రీషియన్లకు తక్షణమే నాణ్యమైన పీపీఈ కిట్లు అందించాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెట్టి శంకర్ రావు, పేరం రమేష్, గరిగె స్వామి, రవీందర్ రెడ్డి, గుర్రపు సతీష్, మరేపల్లి బాపు, మారుతి, గోపాల్ రెడ్డి, రమేష్, నంబయ్య తదితరులు పాల్గొన్నారు.







