నస్పూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద అరైవ్.. అలైవ్.. అవగాహన
నస్పూర్, ఆర్.కె న్యూస్: జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కారులో వచ్చే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని, ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు హెల్మెట్ ధరించడాన్ని విధిగా పాటించాలని, లేకుంటే ఇకపై కలెక్టర్ కార్యాలయంలోకి వాహనదారులను అనుమతించబోమని మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ స్పష్టం చేశారు. అరైవ్.. అలైవ్.. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నస్పూర్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ కమాన్ వద్ద వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, సందర్శకులకు హెల్మెట్, సీటు బెల్టు ప్రాధాన్యతను వివరించారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే పోలీసుల ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సహకారం ఉంటేనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యమవుతుందని గోపతి రవీందర్ చెప్పారు. ప్రతి వాహనదారుడు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు కేవలం జరిమానాల కోసం కాదని, ప్రతి ఒక్కరి క్షేమం కోసమని గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు కలెక్టరేట్ లోపలికి ప్రవేశం ఉండదని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే వారు ఇతర ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. వాహనదారులందరూ పోలీసులకు సహకరించి రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని కోరారు. నిబంధనల అమలులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీసీ నస్పూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మేకల ప్రశాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







