- శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
- గనుల ఉత్పాదకత, విస్తరణపై అధికారులతో సమీక్ష
ఆర్.కె న్యూస్, నస్పూర్: కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు లోబడి గనుల ఉత్పత్తి జరగాలని, పర్యావరణ పరిరక్షణను అధికారులు బాధ్యతగా తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియా కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా పరిధిలోని భూగర్భ, ఉపరితల గనుల ఉత్పత్తి, ఉత్పాదకత, పర్యావరణ హిత చర్యలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గనుల విస్తరణలో భాగంగా పర్యావరణ అనుమతులు, నిబంధనల కొనసాగింపుపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులలో ప్రస్తుతం ఉత్పత్తి కొనసాగుతున్న ప్రదేశాలు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించాల్సిన ప్రదేశాలకు సంబంధించి పర్యావరణ శాఖ నుంచి పొందాల్సిన అనుమతులు, పాటించాల్సిన నియమాలపై సుదీర్ఘంగా చర్చించారు. బొగ్గు వెలికితీత సమయంలో కాలుష్యానికి ఆస్కారం లేకుండా చేపడుతున్న చర్యలను ఏరియా ఎన్విరాన్మెంటల్ అధికారి హనుమాన్ గౌడ్ పీపీటీ ద్వారా వివరించారు. పర్యావరణ విభాగం ప్రదర్శించిన అంశాలను పరిశీలించిన జీఎం, నిబంధనల అమలులో ఎటువంటి అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణా రావు, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్సార్పీ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్.కె 5 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, ఎన్విరాన్మెంటల్ అధికారి హనుమాన్ గౌడ్, వివిధ విభాగాల అధిపతులు, గనుల మేనేజర్లు, రక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







