- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
- నారి శక్తి వందన్ బిల్లును అడ్డుకోవడంపై బీజేపీ ధ్వజం
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: నారి శక్తి వందన్ బిల్లును లోక్ సభలో అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం మహిళా ద్రోహం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ విమర్శించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకించడం వల్ల రాష్ట్రంలో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కేంద్రం ఇస్తున్న హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటూనే ఉందని రఘునాథ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ వల్ల కేవలం హైదరాబాద్లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. దీనివల్ల తెలంగాణలోని మిగతా జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మహిళా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మహిళలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ముకేష్ గౌడ్, కార్పొరేటర్ అనిత, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆంజనేయులు, స్వాతి, సుజాత, స్వప్న, రజిత, సరుతారెడ్డి, జయరాం రావు,రాజు కుమార్, స్వామి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







