శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం నార్కోటిక్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కలిసి శ్రీరాంపూర్ బస్ స్టాండ్, ఆటో స్టాండ్, పార్కింగ్ స్థలాలు, సమీప హోటళ్లు, పాన్ షాపుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఎస్ఐ పేర్కొన్నారు. ప్రయాణికుల సామాను, అనుమానాస్పద ప్రాంతాలను నార్కోటిక్ డాగ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే తక్షణమే పోలీసులకు అందించి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది పాల్గొన్నారు.







