విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహారాష్ట్రలోని నాసిక్లో గత నెల 25 నుండి 30 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా కీర్తిని చాటిన ఈ విజేతలను బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో రాణించి పతకాలు సాధించడం ఎంతో భినందనీయమన్నారు. ఈ పోటీల్లో కె. మోక్షిత్ బంగారు పతకం సాధించగా.. ఇ. దక్ష, వి. అక్షర వేదశ్రీ, ఎ. శ్రీ మహాలక్ష్మి శర్మ, టి. ఆరుష్, జి. విగ్నేష్లు రజత పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే పి. రితేష్, జి. అచ్యుత్ శ్రీ దేవాన్ష్, టి. నయనశ్రీ, టి. నిహానిష్, టి. శివాజీలు కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటారు. క్రీడాకారులు ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెన్కాక్ సిలాట్ మంచిర్యాల జిల్లా సెక్రటరీ దాసరి రాజేశ్వర్, మాస్టర్ పోచంపల్లి వెంకటేష్, స్టేట్ టెక్నికల్ చైర్మన్ రంగు శ్రీనివాస్, కోశాధికారి మెయిన్, జెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







