మహిళా హక్కుల పోరాటంలో గుర్తింపు.. బీసీ ఉపకోటాకై ఉద్యమించాలని పిలుపు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో మంగళవారం హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్యను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలేఖ్య ‘మహిళా లెజెండరీ జాతీయ అవార్డు’ అందుకున్నారు. మహిళల హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన మహిళకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని సమితి నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. అలేఖ్య అనేక సంవత్సరాలుగా మహిళా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కల్పించాలని సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధన కోసం జరిగే ఉద్యమాల్లో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటి తరం మహిళలు అలేఖ్యను స్ఫూర్తిగా తీసుకుని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రాజన్న చారి, మంచిర్ల సదానందం, కొట్టే నటేశ్వర్ తో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.







