జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి, ఆర్.కె న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్యనిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు సంధి ప్రతాపరెడ్డి – ఏఎస్ఐ, డీసీఆర్బీ, భూపాలపల్లి డీపీఓ, మదన నాగయ్య – ఏఎస్ఐ, రేగొండ పోలీస్ స్టేషన్, చింత సుధీర్ – ఏఎస్ఐ, కాటారం పోలీస్ స్టేషన్, మాచర్ల వైకుంఠం – ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, హెడ్క్వార్టర్స్, భూపాలపల్లి పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ హాజరై రిటైర్డ్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సేవలు అత్యంత కఠినమైనవని, కుటుంబ సౌకర్యాలను పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయడం పోలీస్ సిబ్బంది ప్రత్యేకత అని పేర్కొన్నారు. అనేక ఒత్తిడులు, సవాళ్ల మధ్య విధులను సమర్థవంతంగా నిర్వహించిన రిటైర్డ్ అధికారుల సేవలు ప్రశంసనీయమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కుటుంబ సభ్యులతో మరింత సమయం గడుపుతూ ఆనందకరమైన జీవితం గడపాలని సూచించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి వారి విశిష్ట సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్,రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి గౌరవం లభించడమే కాకుండా, ప్రస్తుత పోలీస్ సిబ్బందికి కూడా ఇది ప్రేరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.








