- నూతన బొగ్గు గనుల ప్రారంభంతోనే సింగరేణికి ఆర్థిక భద్రత
- బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్య నిర్మూలనకు రాబోయే మహాసభలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 7న భూపాలపల్లిలో జరగనున్న బీఎంఎస్ 29వ ద్వైవార్షిక మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా మహాసభల గోడప్రతులను ఆవిష్కరించారు. జూన్ 7న జరిగే మహాసభలకు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కళాల్ శ్రీనివాస్, ఏబీకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షురాలు వర్ష ఫుడ్కే, జాతీయ కార్యదర్శి పి. మాధవ నాయక్ అతిథులుగా హాజరవుతారని సత్తయ్య తెలిపారు. సింగరేణి పరిశ్రమ పరిరక్షణ, కార్మిక హక్కులు, సంక్షేమం కోసం బీఎంఎస్ అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సంస్థకు రావలసిన సుమారు రూ. 51,149 కోట్ల విద్యుత్తు బొగ్గు బకాయిలను వసూలు చేసేందుకు యాజమాన్యం యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. కోల్ ఇండియా మాదిరిగా అలవెన్సులపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలన్నారు. అపారమైన బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు నూతన బొగ్గు గనులను ప్రారంభించాలని, తద్వారా నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కొనసాగిన కార్పొరేట్ మెడికల్ బోర్డును యధావిధిగా పునరుద్ధరించాలని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కార్మికుల మారుపేర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని, వివిధ కారణాలతో తొలగించిన కార్మికులకు తిరిగి అవకాశం కల్పిస్తూ ఆంక్షల సర్కులర్ను ఎత్తివేయాలన్నారు. కోల్ ఇండియా తరహాలోనే కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా కార్యదర్శి రాజారామ్ కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కనవేని సాగర్ పాల్గొన్నారు. పిట్ సెక్రటరీలు కొమ్మ బాపు, కుమ్మరి చంద్ర శేఖర్, కుంట రాజు, బద్దె ప్రభాకర్, ఎస్సార్పీ 3 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చల్ల శ్రీనివాస్, సామల కిషోర్ పాల్గొన్నారు.







