వేమనపల్లి, ఆర్.కె న్యూస్: మండలంలోని ముల్కలపేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఒడిల కళ్యాణి సుధాకర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మెయిన్ రోడ్డుపై కొంతకాలంగా నాలీలు మట్టితో నిండిపోగా పారిశుధ్య కార్మికుల సాయంతో నాలీల మట్టిని చెత్తను తొలగించారు. అలాగే గత కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న రెండు బోర్లకు మిషన్ ప్రెషర్ తో క్లీన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోర్కుటి నరేష్, వార్డు సభ్యులు పాలే శైలజ కిరణ్, బోర్కుటి తిరుపతి, దాగమ బాపు, కొండ్ర పున్నం,ఎస్టీ కాలని స్కూల్ టీచర్ కమలాకర్ పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
- సృష్టి నవోదయ సైనిక్ స్కూల్ 13వ వార్షికోత్సవం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అభినందనీయమని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ లో గల నరసయ్య భవనంలో మంగళవారం
సృష్టి నవోదయ సైనిక్ స్కూల్ 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ నవోదయ, సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్న పాఠశాల యాజమాన్యం కృషిని ఆయన కొనియాడారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించలేని వారికి ఈ విద్యాసంస్థ అండగా నిలుస్తోందని ధర్ని మధుకర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నడుపుతున్న నవోదయ, సైనిక్ పాఠశాలల్లో సీట్లు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నవోదయలో సీట్లు సాధించిన అనుశ్రీ, దీప్తి, కృషిత, నవదీప్, ప్రణీత్, సంజావిలను మేయర్ ప్రత్యేకంగా సత్కరించారు. జాతీయ స్థాయి సైనిక్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన అంబాల రిహాన్ తేజ, పృథ్విలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సృష్టి డైరెక్టర్లు అంబాల రాజ్ కుమార్, భాస్కర్ రెడ్డి పాఠశాల విజయాలను వివరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల విద్యాధికారి పద్మజ, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్ర పాణి, జిల్లా ట్రెజరర్ కృష్ణారెడ్డి, ఉపేందర్, మండల ట్రస్మా అధ్యక్షులు మైదానం రామకృష్ణ, అమన్ ప్రసాద్, దేవన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- తల్లిదండ్రుల గర్వం… విద్యార్థుల ఆనందం
మందమర్రి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కేంద్రంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు ఆకర్షణీయమైన గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. టోపీలు ఎగరేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన విద్యార్థుల సందడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ, ప్రాథమిక విద్య పూర్తి చేసి ఉన్నత తరగతుల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఇది ఒక మధురమైన మైలురాయి అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని, తల్లిదండ్రులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కొన్ని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భావోద్వేగ క్షణాలు కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని గర్వంగా చూసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ వేడుకలో పాఠశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోషకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది.
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి
- ఆర్.కె-5 గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగాలు ఇవ్వలేక కార్మిక సంఘాలను బదనాం చేసే పద్ధతి మానుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ వేదికగా కార్మిక సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సంఘాల ఫిర్యాదు వల్లే మెడికల్ బోర్డు ఆపామని చెప్పడం సరికాదని విమర్శించారు. యువ కార్మికుల వల్ల సంస్థ ఆర్థికంగా నష్టపోతుందనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ నెలలోనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, మెడికల్ దందాలో ఉన్న నాయకులు, అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గనులలో స్థానిక సమస్యలు పెరిగిపోతున్నాయని డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్ ఆరోపించారు. కార్మికులకు డ్రిల్ బిట్లు, నాణ్యమైన డ్రిల్ రాడ్లు, గ్లౌజులు, ఇతర పనిముట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పని స్థలాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన సంఘాల నాయకులు గనుల్లోకి దిగి పనిచేయకపోవడం వల్లే ఈ సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కార్మిక సంఘాల పట్ల ఒకే విధంగా ఉందని రాజారెడ్డి విమర్శించారు. ఏఐటీయూసీ నాయకులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎనర్జీ సెక్టార్ను ఏకం చేసి నిరవధిక సమ్మె చేయడానికి జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసే నాయకుల పట్ల కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు శ్రీనివాస్, చిగురు లక్ష్మణ్, బట్టు సురేందర్, పోతు వెంకటేష్, తోట విజయ్ సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
423 మందికి ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 423 మంది టీచర్లకు ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను డిజిటలైజ్ చేయడానికి, విధి నిర్వహణలో వేగం పెంచడానికి ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
నెలకు ఒకసారి శుభ్రం చేయాలని మేయర్ ఆదేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్లో మున్సిపల్ సిబ్బంది మంగళవారం తాగునీటి ట్యాంకును శుభ్రం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి నెలా ట్యాంకులను తప్పనిసరిగా శుద్ధి చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మేయర్ దర్ని మధుకర్ ఆదేశించారు. ఈ మేరకు కార్పొరేషన్ సిబ్బంది ట్యాంకును పూర్తిగా శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ కార్యక్రమాన్ని 32వ డివిజన్ అధికారి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా పర్యవేక్షించారు. తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్పొరేషన్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
- టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక బాట కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని కార్మికులను కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. గని యాజమాన్యం కార్మికులపై అధిక పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మిక సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని మణిరామ్ సింగ్ విమర్శించారు. నిలిపివేసిన మెడికల్ బోర్డును తక్షణమే ప్రారంభించాలని, అనారోగ్యంతో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కొత్త గనులు ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. పని స్థలాల్లో అవసరమైన పనిముట్లు సమకూర్చాలని, మహిళా కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని మణిరామ్ సింగ్ కోరారు. సింగరేణిలో కార్మికులు అదనంగా ఉన్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికులకు లాభాల వాటాను యథావిధిగా చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గద్దల నారాయణ, ట్రెజరర్ రాజనర్సు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్లు మల్లయ్య, బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజర్ కొత్తూరి నారాయణ, నాయకులు గజ్జె దుర్గయ్య, సుందిళ్ల స్వామి, రాజబాబు, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం కుల మత ప్రాంత భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాలి
- ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య
- శ్రీరాంపూర్లో మల్లేపల్లి లక్ష్మయ్య, జయ దంపతులకు ఘనంగా పౌర సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: పిల్లల భవిష్యత్తు కోసం కుల మత ప్రాంత భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఆదివారం బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు, మూవ్మెంట్ 21 ఆర్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య,
మాతా రమాబాయి అంబేద్కర్ అవార్డు గ్రహీత మల్లేపల్లి జయ దంపతులకు ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. సామాజిక మార్పు కోసం వారు చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ వివిధ సంఘాల ప్రతినిధులు వారిని సత్కరించారు. భవిష్యత్తులో సాధారణ ప్రజల జీవనం మరింత కష్టతరం కానుందని మల్లేపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల మనుగడ కోసం అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. సమాజ మార్పు కోసం తన కలం ద్వారా చైతన్యాన్ని నింపుతూ, తన ఆలోచనలతో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మల్లేపల్లి లక్ష్మయ్య జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. మల్లేపల్లి జయ సామాజిక రంగంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటు జీఎం, బీసీ లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో దలిత్ బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కె. శ్యామలాదేవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. ప్రవీణ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు ముస్కె సమ్మయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు జి. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ నాయకులు డేగల ప్రవీణ్, దారావత్ రాజేష్, నెలబోయిన కుమార్ హాజరయ్యారు. ఎస్సీ లైజన్ ఆఫీసర్ కె. ఆనంద్ కుమార్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ గుండె రావు, బద్రి బుచ్చయ్య, ఐఎన్టీయూసీ నాయకుడు కలవేని కుమారస్వామి, టీజీబీకేఎస్ నాయకులు బడికల సంపత్, పెట్టేం లక్ష్మణ్ తదితరులు తమ సంఘాల తరపున పాల్గొన్నారు. కళాకారులు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య
- నస్పూర్లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించే దిశగా కృషి చేయాలని బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నస్పూర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో జగ్జీవన్ రామ్ చూపిన త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మరువలేనివని కొనియాడారు. సమానత్వం, న్యాయం, సేవ అనే విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అక్కూరి సుబ్బన్న కోరారు. దళితుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఆకునూరి సంపత్, రుకుం తిరుమల్, జాడి భానుచందర్, కాటం రాజ్ కుమార్, కందుల ప్రశాంత్, నోముల నరేందర్ రెడ్డి, ఇరుగురాల వంశీ, ఒడ్డే వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఐక్యత పెంపొందించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయి
- ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
- శ్రీరాంపూర్లో ఆర్.కె-7 గని కార్మికుల క్రికెట్ పోటీలు ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగుల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఐక్యత పెంపొందించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్
అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఆర్.కె-7 గని కార్మికుల వన్ డే క్రికెట్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు సారథ్యంలో ఈ పోటీలు జరిగాయి. బి. జనక్ ప్రసాద్ స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సింగరేణి అభివృద్ధికి ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యువ క్రీడాకారులు కోల్ ఇండియా, జాతీయ స్థాయిల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందిస్తామని బి. జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో రీజియన్ వారీగా, కంపెనీ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య సేవలు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. క్రీడాకారులకు అవసరమైన యూనిఫామ్స్, మెటీరియల్స్, సదుపాయాల మెరుగుదలకు యూనియన్ కృషి చేస్తుందని వెల్లడించారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులు జట్టు భావనతో క్రీడా స్ఫూర్తిని చాటాలి” అని బి. జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతరం విజేతలైన ఆర్.కె-7 గని సి రిలే జట్టు, ఇంజనీరింగ్ సెక్షన్ జట్టుకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భీమ్ రావు, కలవేని శ్యామ్, గరిగస్వామి, పి తిరుపతి రాజు, భీమ్ రవి, ప్రవీణ్, జీవన్ రావు తో పాటు ఆర్.కె-7 గని అన్ని షిఫ్టుల నాయకులు పాల్గొన్నారు.



