సొన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సొన్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామస్తులకు సైబర్ నేరాలపై ఏఎస్ఐ దేవన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచితులు ఫోన్ చేసి ఓటిపి గానీ, సివివి నెంబర్ కానీ చెప్పకూడదని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగినప్పుడు వివరాలు చెబితే బ్యాంకు ఖాతాలోని డబ్బులను స్వాహా చేసే అవకాశం ఉందని, అందుకు ఎవరికి బ్యాంకు వివరాలను చెప్పకూడదని సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్కు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికుల షిఫ్ట్ సమయాలను మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్కు యూనియన్ ప్రతినిధులు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పెరుగుతున్న ఎండల వల్ల కార్మికుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ కార్మికులు విధినిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి అన్ని పని ప్రదేశాలలో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. ఎండల తీవ్రత తగ్గే వరకు పని వేళల్లో తగిన విశ్రాంతి విరామాలు ఇవ్వడంతో పాటు అవసరమైన చోట్ల తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, నాగభూషణం, గండి సతీష్, నల్లపు సత్తయ్య, వెంకటరెడ్డి, పెద్దయ్య, మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత
నస్పూర్, ఆర్.కె న్యూస్: గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ లింగ ఎంపిక నిషేధ చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి హాజరై జిల్లాలో పని చేస్తున్న స్కానింగ్ కేంద్రాలు, స్త్రీ వైద్య నిపుణుల దగ్గర ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అడగడం చట్టరీత్యా నేరమని తెలిపారు. భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా గర్భిణీల పర్యవేక్షణ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల పర్యవేక్షణ, తనిఖీలు, రికార్డులు, సి సెక్షన్ ఆడిట్, తల్లులకు మహిళా సంఘాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేయాలని తెలిపారు. ప్రతి స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ పిసిపి యాంటీ యాక్ట్ పుస్తకము, స్కానింగ్ మిషన్ల వివరాలు ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రంలో ఎలాంటి ఫోటోలు ఉండరాదని, స్కానింగ్ కు వచ్చే గర్భిణులకు సౌకర్యములు కల్పించాలని, లింగ నిర్ధారణ పైన అవగాహన కార్యక్రమాల గోడ ప్రతులను అతికించాలని, ఆసుపత్రి సర్టిఫికెట్లు, సేవల సంబంధిత రుసుముల వివరాలు గోడపై ప్రదర్శించాలని తెలిపారు. నూతన స్కానింగ్ మెషిన్ కొనడానికి ముందుగానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని, పాత మిషన్ తీసివేయాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి అనుమతి తీసుకోవాలని, మూసివేసిన స్కానింగ్ సెంటర్ లో ఉన్న పరికరాలు, యంత్రాలను విక్రయించినట్లయితే కొనుగోలు చేసిన వారి సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో బ్రూణ హత్యల నివారణకు కమిటీ సభ్యులందరూ సహకారం అందించాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలను సందర్శించి లోపాలు ఉన్న వారికి మెమోలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. అరుణశ్రీ, డా. శ్రీదేవి, డా. సుధాకర్, డా. అభినవ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డి. పి. ఓ. ప్రశాంతి, సి హెచ్ ఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ హారిక, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నిర్దేశిత ఉత్పత్తి, ఉత్పాదకత సాధనే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆర్.కె 7 భూగర్భ గని, జీఎం కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కెట్ పోటీ తట్టుకుని సంస్థను లాభాల బాటలో నడపడానికి ఉద్యోగులు కార్యోన్ముఖులు కావాలని స్పష్టం చేశారు. కొత్త గనులు రాకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతోందని మునిగంటి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లోపాల వల్ల సింగరేణి బొగ్గుకు డిమాండ్ తగ్గుతోందని వివరించారు. ఇప్పటికే టన్నుకు దాదాపు 700 రూపాయలు తగ్గించడం వల్ల ఏడాదికి 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. యంత్రాల వినియోగ సమయాన్ని పెంచుకుంటూ సంస్థ ఉనికిని కాపాడాలని కోరారు. ఉద్యోగుల ఉపాధి కేంద్రాలైన భూగర్భ గనుల జీవిత కాలాన్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. జీఎం కార్యాలయంలోని సపోర్టింగ్ డిపార్ట్మెంట్లు ఎలాంటి తాత్సారం లేకుండా విధులు నిర్వహిస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు దోహదపడాలని సూచించారు. ఎస్ఓటూ జీఎం కన్వీనర్గా రెండు బృందాలు ఏరియా పరిధిలోని అన్ని గనులు, విభాగాలలో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆర్.కె 7 గనిలో మూడు షిఫ్టుల ఉద్యోగులకు టీం-1 ప్రతినిధులు సంస్థ ఆర్థిక పరిస్థితులు, గని స్థితిగతులపై అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై డీజీఎం (ఐఈడీ) రాజన్న, ఆర్థిక వ్యవహారాలపై ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, నాణ్యత ప్రాధాన్యతపై హనుమాన్ గౌడ్, రక్షణపై ఏఎస్ఓ విజయ్ కుమార్, సంక్షేమంపై డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ లోటుపాట్లను వివరించారు. సంస్థ సవాళ్లపై కమిటీ కన్వీనర్ ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. సంస్థ మనుగడే లక్ష్యంగా విధులు నిర్వహించాలని గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి సెక్రటరీ మోతుకూరి కొమురయ్య కోరారు.
జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్నల్ ఆడిట్, డిస్పెన్సరీ సిబ్బందికి టీం-2 ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గనుల్లో ఉత్పత్తి సాధన దిశగా సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని అవగాహన కల్పించారు. ఈఈ (ఐఈడీ) సాయికిరణ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కృష్ణారావు, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ నరేష్, అడిషనల్ మేనేజర్ మహేష్, అడిషనల్ మేనేజర్ అమర్నాథ్, డీవై పీఎం రాజేష్ వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిట్ సెక్రటరీ సందీప్ కోరారు. కాగా, మంగళవారం టీం-1 ఆధ్వర్యంలో ఎస్ఆర్పీ 3 గనిలో, టీం-2 ఆధ్వర్యంలో ఎస్ఆర్పీ 1 గనిలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు జరగనున్నాయి.
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారుల సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ‘ప్రయాస్’ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సింగరేణి, సీఎంపీఎఫ్ (CMPF) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారంపై కీలక చర్చలు జరిపారు. సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అంబటి భరత్ కుమార్కు ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ భరత్ కుమార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ల కోసం ‘సీ-కేర్స్’ (C-CARES) పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో పెండింగ్లను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే ‘ప్రయాస్’ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. తాను గతంలో మైనింగ్ ఇంజనీర్గా పని చేసినందున కార్మికుల కష్టనష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. ఈపీఎఫ్ కన్నా సీఎంపీఎఫ్ ఎంతో మెరుగైనదని, ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను చిన్న చిన్న కారణాల కోసం విత్డ్రా చేసి దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ఆ పొదుపు మొత్తమే భవిష్యత్తులో కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సీఎంపీఎఫ్ అధికారులను సంప్రదించడం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు అధికారులే నేరుగా మన వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామమని అన్నారు. రీజినల్ కమిషనర్ భరత్ కుమార్ మైనింగ్ రంగం నుండి రావడం వల్ల క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇది పెండింగ్ క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం కావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియా పరిధిలోని సంక్షేమ అధికారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ (2) గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శి సందీప్, వివిధ గనుల సంక్షేమ అధికారులు, సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏఐటీయూసీతో డైరెక్టర్ (పర్సనల్) చర్చలు సఫలం.. కీలక హామీల మంజూరు
నస్పూర్, ఆర్.కె న్యూస్: హైదరాబాద్లోని సింగరేణి భవన్లో మంగళవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. కార్మికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాలపు పెండింగ్ సమస్యలపై చర్చించిన యాజమాన్యం, పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కార్మిక హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు హామీలను డైరెక్టర్ వెల్లడించారు. నెల రోజుల్లోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న 337 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పిస్తామని, అన్ఫిట్ అయిన మైనింగ్, ట్రేడ్స్మెన్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మారుపేర్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.రిటైర్డ్ కార్మికులకు నిలిపివేసిన లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించేందుకు అంగీకరించారు. అండర్గ్రౌండ్ అలవెన్స్ కట్టింగ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఖాళీలు ఉన్నచోట మూడు సంవత్సరాల నిబంధనతో సంబంధం లేకుండా వెంటనే ట్రాన్స్ఫర్లు చేపడతామని, ఓవర్మన్లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. సొంత ఇంటి పథకం, పెర్క్స్పై ట్యాక్స్ సమస్యలను వచ్చే స్ట్రక్చర్ మీటింగ్లో చర్చించి ఖరారు చేస్తామని, క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
వీఆర్ఎస్ ఉండదు.. డైరెక్టర్ స్పష్టత:
సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్షేక్ లేదా వీఆర్ఎస్ వంటి పథకాలను అమలు చేసే ఉద్దేశం యాజమాన్యానికి లేదని డైరెక్టర్ గౌతమ్ పొట్రు స్పష్టం చేశారు. అలాగే జనరల్ సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులకు పీనల్ వేజ్ కట్టింగ్ను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలను త్వరలో సీఎండీ స్థాయి సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న చైర్మన్ రామకృష్ణ
సొన్, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను మంగళవారం విద్యుత్ శాఖ చైర్మన్ సలంద్ర రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మండలంలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకోవచ్చారని తెలిపారు. ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జాఫ్రాపూర్ సర్పంచ్ రాజు రెడ్డి తమ గ్రామంలో లో వోల్టేజ్ సమస్య ఉందని తెలుపగా ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కరించాలని రామకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెంబర్ సత్యనారాయణ ఏడిఈ రాజేశ్వర్, డిఈ నాగరాజు, ఏడిఈ శ్రీనివాసరావు, ఇంజనీర్లు అనిల్, సంజీవ్, రాజ్ కిరణ్, సబ్ ఇంజనీర్లు విష్ణు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీసీపీ.. రికార్డుల తనిఖీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారికి సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీ షీటర్ల వివరాలు, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు స్టేషన్కు చేరుకున్న డీసీపీకి అధికారులు మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిరంతరం నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని డీసీపీ సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, శాంతిభద్రతల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీసీపీ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్ఐ ఎం. ప్రశాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్లో సేవా కార్యక్రమాలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్ మండలంలోని పలు హనుమాన్ దేవాలయాల వద్ద భక్తులకు, పాదచారులకు మజ్జిగ, అరటిపండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వూట్కూరి నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా వీఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లెతుల రాజేంద్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జయంతి వేడుకల కోసం ఆలయాలకు తరలివచ్చిన భక్తులకు, పాదచారులకు చల్లని మజ్జిగ అందించి సేదతీర్చారు. సామాజిక సేవలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ శ్యామసుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దండ రామకృష్ణ రెడ్డి, సభ్యులు రేగండ్ల ఉపేందర్, కమృద్దీన్, శ్రవణ్, గోపతి తిరుపతి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
- వనితా వాక్కు ఫౌండర్, అడ్వకేట్ రంగు వేణు కుమార్
- మారుతి నగర్లో మాతృమూర్తులకు పాదపూజ.. వనితా వాక్కు ఫౌండేషన్ ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: “పిల్లల సంతోషంలో స్వర్గం వెతికే ఏకైక దేవత తల్లి. ఆమె బ్రతికుండగానే ప్రేమను పంచడం, అలసిన ఆమె మనసుకు మన సమయం ఇవ్వడమే నిజమైన మాతృదినోత్సవం” అని వనితా వాక్కు ఫౌండర్, అడ్వకేట్ రంగు వేణు కుమార్ పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల మారుతి నగర్లో మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం, పాదపూజను ఘనంగా నిర్వహించారు. తల్లి ప్రేమకు ప్రతిఫలం లేదని, బిడ్డల క్షేమం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని మాతృమూర్తులను గౌరవించుకోవడం అందరి బాధ్యత అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ఇదే రోజున 2022లో వనితా వాక్కు ఫౌండేషన్ స్థాపించబడిన నేపథ్యంలో, సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సభ్యులు జరుపుకున్నారు. గత రెండేళ్లుగా మహిళా చైతన్యం కోసం సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాతృమూర్తుల ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు తల్లులకు పూలమాలలు వేసి, పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వనితా వాక్కు సభ్యులు తమ మాతృమూర్తులతో కలిసి పాల్గొని ఈ వేడుకను మరుపురాని అనుభూతిగా మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో-ఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కురుమ సునీత, డాక్టర్ అన్నపూర్ణ, జోష్ణ చంద్రధర్, చిగురు మంజుల, చందన రాజకొండ, చంద్రకళ, కొండ శైలజ తదితరులు పాల్గొన్నారు.




