18 నుండి ఆన్లైన్లో కోటా ప్రారంభం.. 24 వరకు వివిధ కేటగిరీల టికెట్లు అందుబాటులోకి
తిరుమల, ఆర్.కె న్యూస్: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూలై నెల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ఏప్రిల్ 18 నుండి 24వ తేదీ వరకు వివిధ రకాల దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవలకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో నమోదు ప్రక్రియ 18న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను 23న మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేస్తారు.
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.







