జగిత్యాల అదనపు సెషన్స్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన సి. సునీత రవీందర్ రెడ్డి
మల్యాల, ఆర్.కె న్యూస్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో జగిత్యాల ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జిగా సి. సునీత రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి సాక్షిగా విధుల్లో చేరడం విశేషంగా నిలిచింది. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జడ్జి దంపతులకు అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. విధుల్లో చేరడానికి ముందు సునీత రవీందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో జడ్జి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ స్థానాచారి కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. దైవ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించడం ఒక మంచి పరిణామమని అక్కడికి వచ్చిన భక్తులు పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జడ్జికి కోర్టు సిబ్బంది, ఆలయ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు అధికారులు, స్థానిక ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.







