ఆర్.కె న్యూస్, వేమనపల్లి: మండలంలోని రైతులు పండించిన మొక్కజొన్నలకు రూ. 2400 గిట్టుబాటు ధర ఉండి రైతులు ఆర్థికంగా లాభం పొందాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ కార్యదర్శి రాజ్ నాయక్, స్థానిక సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, డీసీసీ జెనరల్ సెక్రటరీ గాలి మధు, తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తున్నారని దానికి మద్దతు ధర ఉండి రైతులు ఆర్థికంగా లాభం పొందాలని ఉద్దేశంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లి మంచిర్యాల జిల్లాలోనే నీల్వాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడగగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఈ ప్రాంత ప్రజల తరుపున కృతజ్ఞతలు అన్నారు. రైతులు మధ్య దళారల చేతిలో మోసపోకూడదని ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని దీనిని ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం బ్యాంకు మేనేజర్ లక్ష్మి నారాయణ, క్యాతనపల్లి సర్పంచ్ పున్నం, ఉప సర్పంచ్ కయిత శోభ తిరుపతి, ఒడిల రాజన్న, లింగాగౌడ్, వినోద్ రెడ్డి, చెన్నూరి పురుషోత్తం, మంత్రి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్
- జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఏకారి లిఖిత తల్లిదండ్రులకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తల్లిదండ్రుల కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పేర్కొన్నారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ అరుణక్కనగర్కు
చెందిన ఏకారి లిఖిత జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా శనివారం ఆమె తల్లిదండ్రులు వెంకటేష్, లక్ష్మిలను సమితి నాయకులు ఘనంగా సత్కరించారు. సిసిసి కార్నర్ ప్రాంతంలో రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబం తమ బిడ్డను ఉన్నత స్థాయికి చేర్చడం అభినందనీయమని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలను తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన ఈ తల్లిదండ్రులను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి. తల్లిదండ్రుల శ్రమను కళ్లారా చూసిన లిఖిత పట్టుదలతో చదివి జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాన్ని సాధించింది. నేటి యువత లిఖితను ఆదర్శంగా తీసుకోవాలి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత విద్యను అభ్యసించాలి. సొంతంగా ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాన్ని ముద్దాడాలని సూచించారు. యువతకు మార్గదర్శకంగా నిలిచిన లిఖితను సమితి ప్రతినిధులు అభినందించారు. లిఖిత సాధించిన ఈ విజయం జిల్లాలోని బీసీ సామాజిక వర్గ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక వేముల, మంచర్ల సదానందం, పంపరి వేణుగోపాల్, చంద్రగిరి చంద్రమౌళి, రాజు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్లో ఘనంగా సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రదానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగి ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విధుల్లో దృష్టి సారించి సంస్థ అభివృద్ధికి దోహదపడతారని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో 2025-26 సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. వివిధ క్రీడలు, కళా పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల ద్వారానే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రారంభమైన 17 రకాల ఇండోర్, అవుట్ డోర్ క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో రాణించిన శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు, కళాకారులను అభినందిస్తూ మునిగంటి శ్రీనివాస్ పురస్కారాలు అందజేశారు. శ్రీరాంపూర్ క్రీడాకారులకు సింగరేణి స్థాయిలోనే కాకుండా కోల్ ఇండియా, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. కంపెనీ స్థాయి పోటీలతో పాటు కోల్ ఇండియా విభాగాల్లో తిరుగులేని ప్రతిభ కనబరుస్తూ ఏరియాకు గర్వకారణంగా నిలిచారని వివరించారు. ఉద్యోగుల రిక్రియేషన్ కోసం సంస్థ స్టేడియాలు, క్లబ్బులు, ఈత కొలనులు, వ్యాయామశాలలు, పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసింది. ఇటీవల భారీ ఖర్చుతో ఓపెన్ జిమ్ లు కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, ఆర్.కె న్యూ టెక్ మేనేజర్ కూరపాటి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్, జీఏ హానరరీ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సెక్రటరీ చాట్ల అశోక్, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
- మంచిర్యాలలో ఘనంగా సాయుధ పోరాట తొలి అమరుడి జయంతి వేడుకలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడి త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. దొడ్డి కొమురయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కడవెండి గ్రామంలో జన్మించారు. గొల్ల కురుమ వర్గానికి చెందిన ఈ యువకుడు భూస్వాములు, రజాకర్ల అక్రమ కట్టుబాటు వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేశారు. నిజాం పాలనలో దేశ్ ముఖ్ లు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేపట్టిన సమయంలో కొమురయ్య కీలక పాత్ర పోషించారు. కడవెండి పరిసర గ్రామాల్లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతు ప్రజా సంఘాలను ఏర్పరిచారు. వెట్టి చాకిరి, అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలను ముందుండి నడిపారు. సాయుధ పోరాట యోధుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, చంద్రగిరి చంద్రమౌళి, గోలివాడ నర్సింహులు, కీర్తి రవి, వేముల అశోక్, అంకం సతీష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
- గత ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడి.. 2026-27 ఏడాదికి 64.30 లక్షల టన్నుల లక్ష్యం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగుల సమిష్టి కృషితోనే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధన సాధ్యమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో బుధవారం జీఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏరియా సాధించిన ప్రగతిని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 65.16 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 44,06,291 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఎస్సార్పీ 1, ఆర్.కె న్యూ టెక్ గనులు వంద శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించాయన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఓసీపీలు, గనుల కంటే 40 రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తి చేసిన ఆర్.కె న్యూ టెక్ గని ఏరియాకు గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. ఎస్సార్పీ 1 గని కూడా 22 రోజుల ముందే తన లక్ష్యాన్ని చేరుకుందని చెప్పారు. ఆర్.కె 5, ఆర్.కె 7 గనులు కూడా వంద శాతం ఉత్పత్తికి చేరువగా ఉన్నాయని మునిగంటి శ్రీనివాస్ వివరించారు. ఎస్సార్పీ 3, 3ఏ, ఐకె 1ఏ గనులు కూడా బొగ్గు ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలను కనబరిచాయన్నారు. ఉపరితల గనుల్లో కొన్ని ఓబీ కాంట్రాక్టుల ఒప్పంద సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో మట్టి తొలగింపు జరగలేదని స్పష్టం చేశారు. దీనివల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురై వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయామని తెలిపారు. భూగర్భ గనుల జీవిత కాలం పెరగడం వల్ల కార్మికులకు ఉపాధి భద్రత మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 2026-27 సంవత్సరానికి యాజమాన్యం 64.30 లక్షల టన్నుల లక్ష్యాన్ని విధించింది. అధికారులు, కార్మికులు ముందస్తు ప్రణాళికతో సమిష్టిగా కృషి చేసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి తమ ఏరియా అగ్రతాంబూలం ఇస్తోందని మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదంలో అంగవైకల్యం పొందిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కును అందజేశామని చెప్పారు. కారుణ్య నియామకాల ద్వారా మెడికల్ ఇన్ వాలిడేషన్ పొందిన 3828 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. ఏరియాలో తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. 277 మందికి ఎల్ఎస్పీ, 21 మందికి ఎంఎంసీ చెల్లింపులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 9734 మంది విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, రాజన్న, సీనియర్ పీవో ఎస్. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్
- మంచిర్యాలలో 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతుల విడుదల.. ఈనెల 7న పోరాటం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దేశంలో బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ లో బుధవారం
ఈనెల ఏడో తేదీన చేపట్టనున్న 24 గంటల నిరవధిక దీక్షకు సంబంధించిన గోడ ప్రతులను సమితి నాయకులతో కలిసి విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు సాగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశాయని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గుమ్ముల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు కూడా బీసీల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. హక్కుల సాధన కోసమే ఈనెల 7న నిరవధిక దీక్షకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. జిల్లాలోని బీసీ కుల సంఘాలు, బీసీ వాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. బీసీ సమాజం ఏకతాటిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గజ్జెల్లి వెంకటయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, నాయకులు వేముల అశోక్, మంచెర్ల సదానందం, చెలిమెల అంజయ్య, రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ ధర్నాకు గ్రేటర్ హైదరాబాద్ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘీభావం
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: దశాబ్దాల పాటు ప్రాణాలను పణంగా పెట్టి చీకటి గనుల్లో శ్రమించి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన బొగ్గు గని కార్మికులు నేడు వెయ్యి రూపాయల లోపు పెన్షన్తో ఆకలితో అలమటిస్తున్నారు” అని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్లో నిర్వహించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘీభావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా ఈ నిరసన చేపట్టారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంతో ఢిల్లీ వెళ్లలేకపోయిన విశ్రాంత ఉద్యోగులు ఇక్కడ ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను చాటారు.
కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 నిబంధనల ప్రకారం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి పెన్షన్ సవరించాల్సి ఉన్నా అమలు కావడం లేదని వేణు మాధవ్ విమర్శించారు. గత ఐదేళ్లుగా దిల్లీ, వారణాసి, కోల్ కత్తా, నాగ్పూర్, కొత్తగూడెం వంటి నగరాల్లో అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు పెరిగినా పెన్షన్ పెంచకపోవడం వల్ల విశ్రాంత కార్మికులు దారిద్ర్యంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం 300 శాతం పెరిగిన నేపథ్యంలో కరువు భత్యం లేని పెన్షన్ ఏమాత్రం సరిపోదని వివరించారు. యంత్రాలు త్రుప్పు పడితే మూలకు పడేసినట్లుగా ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగుల జీవితాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ 2025 డ్రాఫ్ట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలకు పెంచడంతో పాటు కరువు భత్యంతో కూడిన పెన్షన్ అందించాలని కోరారు. ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, వితంతువులకు ఫ్యామిలీ పెన్షన్ జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య, కె.బీరయ్య, సంయుక్త కార్యదర్శి సామంతుల నర్సింగ్ రావు, గీస కనకయ్య సహా సుమారు 50 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాకు సంఘీభావం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోల్ పెన్షనర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఈ పిలుపునిచ్చింది. గత 28 ఏళ్లుగా పెన్షన్ పెంచకపోవడంపై విశ్రాంత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
1998లో కుదిరిన ఒప్పందం ప్రకారం మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సి ఉన్నా, యాజమాన్యం పట్టించుకోవడం లేదని సంఘం నేతలు విమర్శించారు. కరువు భత్యంతో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్
అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 15,000 రూపాయలు చెల్లించాలని కోరారు. సీపీఎంఆర్ఎస్ హెల్త్ కార్డు పరిమితిని 8 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 2017 జనవరి నుండి పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షల రూపాయలను విశ్రాంత ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
గోల్డెన్ హ్యాండ్ షేక్ పద్ధతిలో పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ కంటే తక్కువగా, నెలకు 350 నుండి 1000 రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి స్వల్ప మొత్తంతో జీవనం సాగించడం భారంగా మారిందని పేర్కొన్నారు. ధరల ద్రవ్యోల్మానం 300 శాతం పెరిగినప్పటికీ, పెన్షన్ పెంచకపోవడంతో వృద్ధాప్యంలో కనీస అవసరాలు తీర్చుకోలేక దారిద్య్రంలో మగ్గుతున్నామని వాపోయారు. తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయాలని కోరారు.
సింగరేణి సంస్థలో మారుపేర్ల మార్పు ప్రక్రియ పూర్తి చేయాలని, నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు బావులను తక్షణమే ప్రారంభించాలని నేతలు డిమాండ్ చేశారు. సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించి, ఏరియా ఆసుపత్రులలో గతంలో మాదిరిగానే ఇన్ పేషెంట్లకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాంతాల నుండి వయో వృద్ధులైన విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ధర్నాలో సంఘం అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ఉపాధ్యక్షుడు పానగంటి పోషం, సలహాదారుడు మహేందర్ రాజు, నాయకులు రామ్ రావేందర్, ఆడెపు రాజేశం, రేణికుంట కొమురయ్య, బి. రాజన్న, బింగి రాజేశం, గజెల్లి సుదర్శన్, మేకల రమేష్, శ్రీనివాస్, కాలువల నర్సయ్య, అడిచర్ల రాజేశం, రమేష్, మురహరి, నిచ్చకోళ్ల అంజన్న, పోతరాజుల చంద్రయ్య, రాంబాబు, గోపతి లక్ష్మణ్, సర్వేశ్వర చారి, దేవులపల్లి రామస్వామి, రాజన్న గౌడ్, భీంసేన్, హనుమాండ్ల బుచ్చయ్య, విఘ్నేష్, రాజ్ మొహమ్మద్, చుక్క నారాయణ, కె. దేవయ్య, ఎంఎస్ అలీ భేగ్, మంచాల రామయ్య, గుజ్జ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, ఆర్.కె న్యూస్: జైపూర్ మండలంలోని కాన్కూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు.టీజీ ఎఫ్ డీసీ కి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలో ఉన్న వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో, ప్లాంటేషన్ లలో ఈ వేసవిలో నీటి వృధాను అరికట్టి జల సంరక్షణ చర్యలు చేపడుతూ ఈ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
పవర్ లక్ష్మి కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ కు చెందిన పవర్ లక్ష్మి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 2,50,000 ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. పవర్ లక్ష్మి కుటుంబ సభ్యులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి ఈ నిధులను మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులోనూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవ పట్ల లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



